ఈ కాలంలో అతి పెద్ద రోగమేదైనా ఉందంటే అది ఒత్తిడే. ఇది వైద్యులు చెబుతున్న మాట. ప్రపంచం మొత్తం మీద దాదాపు 80% మంది పని ఒత్తిడికి కుంగిపోతుంటే అందులో సగానికి పైగా ఒత్తిడిని జయించే మార్గాల కోసం అన్వేషిస్తున్నారట. ఈ ఒత్తిడిని వెంటనే గ్రహించి సరైన పరిష్కారాన్ని కనుగొనకపోతే అది అల్జీమర్స్ (మతిమరుపు), వూబకాయం, హృద్రోగం, అధిక రక్తపోటు వంటి పలు సమస్యలకి దారి తీస్తుందని మానసిక వైద్యులు చెబుతున్నారు. మరి అటువంటి ఈ ఒత్తిడి భూతాన్ని ఎలా తరిమేయాలి ? ఇందుకోసం మానసిక వైద్యులు, రచయిత 'నీల్ షా' నాలుగు వారాల ఓ ఉపాయాన్ని కనుగొన్నారు. అదేంటో చూద్దాం రండి !

మొదటి వారం ఇలా చేయండి !
* ఒత్తిడిని జయించడంలో మానసిక వైద్యులు సూచించిన మొదటి స్టెప్.. రాత్రి సమయంలో మీ ఫోన్లని పక్కన పెట్టేయడమే ! గ్యాడ్జెట్ల నుంచి కొద్దిసేపైనా మనకి మనం కాస్త విరామాన్ని ప్రకటించుకోవడమే ఈ దశ ఉద్దేశం. అందుకే డిజిటల్ ప్రపంచానికి విరామాన్ని ప్రకటిస్తూ రాత్రి 8 నుండి ఉదయం లేచే వరకు ఫోన్, ఇతర గ్యాడ్జెట్లకు రెస్ట్ ఇవ్వమంటున్నారు వైద్యులు.

* ఇక ఈ వారంలో చేయాల్సిన మరో పని.. ఓ లిస్ట్ తయారు చేసుకోవడం. ఏంటా లిస్టు అంటారా ? చిన్న చిన్న విషయాలని మార్చడం వల్ల మన జీవితంలో చాలా పెద్ద మార్పులొస్తాయని వైద్యులు అంటున్నారు. అందుకే ఉదయం లేచిన దగ్గర్నుంచి రాత్రి పడుకోబోయే వరకు మీరు చేసే ప్రతి పనిని లిస్ట్గా రాసుకోమంటున్నారు. ఇలా చేయడం వల్ల మీరు ఏ విషయంలో ఒత్తిడికి లోనవుతున్నారో తెలిసిపోతుందంటున్నారు.
* ఇక చివరగా పాటించాల్సింది చక్కటి నిద్ర. వివిధ రకాల సమస్యలు కేవలం మంచి నిద్ర వల్ల నయమవుతాయని నిపుణులు చెబుతున్నారు. అందుకే నిద్ర విషయంలో మనల్ని మనం పసిపిల్లల్లా భావించుకుని స్ట్రిక్ట్గా వ్యవహరించుకోవాలంటున్నారు.

రెండో వారంలో ఇలా చేయాలి !
* ఒత్తిడికి లోనయ్యేవారు ఆహారాన్ని ఎక్కువగా తీసుకొనే వీలుంది. చాలామంది వూబకాయులుగా మారడానికి ఈ ఒత్తిడే కారణం. కాబట్టి సాధ్యమైనంత వరకు బిర్యానీలు, స్వీట్లు, ఇతరత్రా జంక్ ఫుడ్స్, బయట తిండ్ల జోలికి పోవద్దని సూచిస్తున్నారు నిపుణులు.
* అంతేకాదు.. ఆల్కహాల్తో పాటు ఎక్కువ తీపి పదార్ధాల జోలికి వెళ్లవద్దని చెబుతున్నారు. ఎందుకంటే అధిక చక్కెర ఒత్తిడిని మరింత పెంచుతుందట.
* ఇకపోతే ఆహారాన్ని కొద్ది కొద్ది మోతాదులో తీసుకుంటూ సమతూకం ఉండేలా చూసుకోవాలి. అనవసరమైన స్నాక్స్ వదిలిపెట్టి కూరగాయలు, పండ్లను రోజులో అయిదుసార్లు తినేలా డైట్ ప్లాన్ చేసుకోవాలి.

మూడో వారంలో ఆ రెండూ ముఖ్యం !
అటు రకరకాల గ్యాడ్జెట్స్ని లిమిటెడ్గా వాడుతూ.. ఇటు భోజనంలో సరైన నియమాలను పాటిస్తూ మూడవ వారంలోకి అడుగుపెట్టిన తర్వాత చేయాల్సిన అతి ముఖ్యమైనది 'ధ్యానం'. అవును నిజమే ! అన్ని రోగాలకీ మంచిదని అందరికీ తెలిసిన ఈ ధ్యానమే ఒత్తిడిని జయించడంలో అద్భుత ఔషధి. దీన్ని ఎలా చేయాలో కూడా మానసిక వైద్యులు సూచిస్తున్నారు.
* ఎక్కడైనా రిలాక్డ్స్గా నిల్చుని లేక కూర్చుని నడుముని నిటారుగా ఉంచాలి.
* గాలి పీలుస్తూ అయిదంకెలని లెక్కపెట్టాలి.
* ఇప్పుడు పది సెకండ్ల పాటు వూపిరిని నిలపాలి.
* ఆ తర్వాత ఎనిమిదంకెలని లెక్కపెడుతూ గాలిని బయటకి వదలాలి.
* ఇలా పలుమార్లు రిపీట్ చేయాలి.
ధ్యానంతో పాటు ఈ వారంలో నేర్చుకోవాల్సింది 'నో' చెప్పడం. తలకి మించిన భారం నెత్తినేసుకోవడం కూడా ఒత్తిడికి ఒక కారణమే. ఇష్టం లేకపోయినా మొహమాటంతో ఇతరులు చేయాల్సిన పనిని తమ భుజాలపై వేసుకుంటుంటారు చాలామంది. దీనివల్ల మీరు చేయాల్సిన ఇతర పనులపై ప్రభావం పడుతుంది. అప్పుడు మీకు తెలియకుండానే మీలో ఒత్తిడి ప్రవేశిస్తుంది. అందుకే అటువంటి సందర్భాల్లో 'నో' చెప్పడం అలవాటు చేసుకోవాలంటున్నారు వైద్యులు.

నాలుగో వారంలో ఓపిక పట్టండి !
ఈ లోకంలో మనుషులు మూడు రకాలుంటారట. అసలు ఆరంభించని వారు, ఆరంభించి మధ్యలో వదిలిపెట్టే వారు, ఆరంభించి విజయవంతంగా ముగించేవారు. మరి వీటిలో మీరు ఎవరో మీరే నిర్ణయించుకోండి. ఎందుకంటే మానసికంగా మనిషిలో ఎటువంటి మార్పు రావాలన్నా కనీసం నాలుగు వారాలు పడుతుందంటున్నారు వైద్యులు. అప్పటి వరకు ఓపికతో పై నియమాలను క్రమపద్ధతిలో పాటించడం తప్పనిసరి.
ఇక నాలుగో వారం అంతా కూడా మీరెలా మానసికంగా వృద్ధి చెందుతున్నారన్న దానిపైనే దృష్టి పెట్టాలి. అవసరమైతే మీలో మీరు గమనించిన పాజిటివ్ విషయాలను నోట్ చేసుకోవాలి. అలాగే మీ తప్పులనూ గమనించగలగాలి. వాటిని సవరించుకునే మార్గాలను అన్వేషించాలి. ఇలా ఆలోచనలు ఆచరణలోకి మారి అలవాట్లుగా మారినప్పుడే మీపై మీరు విజయం సాధిస్తారు. మరి అలా చేస్తారు కదూ !