అధిక రక్తపోటు (హైపర్టెన్షన్).. ప్రస్తుతం చాలామంది ఎదుర్కొంటున్న ఆరోగ్య సమస్యల్లో ఇదీ ఒకటి. ధమనుల్లో రక్తం అధిక ఒత్తిడితో ప్రసరించడం వల్ల ఈ సమస్య తలెత్తే అవకాశాలున్నాయి. ఒత్తిడితో పాటు ఇతర అంశాలు కూడా దీనికి కారణమవుతున్నాయని పరిశోధకులు గుర్తించారు. ఈ సందర్భంగా ఈ సమస్య తలెత్తడానికి గల కారణాలు, దాన్ని అదుపులో ఉంచుకోవడానికి ఉపకరించే కొన్ని సహజసిద్ధ మార్గాల గురించి తెలుసుకుందాం రండి..

కారణాలివే..
అధిక రక్తపోటు సమస్య తలెత్తడానికి మన జీవనశైలిలో చోటుచేసుకునే మార్పులే ఎక్కువగా కారణమవుతున్నాయి. ఇందులో స్థూలకాయం, నిద్రలేమి, ఉప్పు అధికంగా తీసుకోవడం, వ్యాయామం చేయకపోవడం, ఒత్తిడి, గర్భ నిరోధక మాత్రలు, నొప్పి నివారిణులు ఎక్కువగా వాడడం.. వంటివి ప్రధాన కారణాలుగా చెప్పుకోవచ్చు. దీనివల్ల గుండె పోటు, కిడ్నీ సమస్యలు.. వంటి ప్రాణాంతక అనారోగ్యాల బారిన పడే అవకాశమూ లేకపోలేదు. కాబట్టి ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకుంటూనే దాన్ని అదుపులో ఉంచుకోవడానికి కొన్ని సహజసిద్ధమైన చిట్కాలు పాటిస్తే ఎలాంటి ప్రమాదమూ ఉండదు.

పుచ్చకాయ గింజలు..
పుచ్చకాయలు శరీరం డీహైడ్రేషన్కి గురి కాకుండా కాపాడతాయి. అలాగే వాటిలో ఉండే గింజల వల్ల కూడా ఆరోగ్యానికి ఎన్నో ప్రయోజనాలున్నాయి. ముఖ్యంగా వాటిని ఉపయోగించి రక్తపోటును అదుపులో ఉంచుకోవచ్చు. ఇందుకోసం పుచ్చకాయ గింజలు, గసగసాలు.. ఈ రెండింటినీ సమపాళ్లలో తీసుకొని మెత్తగా మిక్సీ పట్టుకోవాలి. ఈ మిశ్రమాన్ని రోజూ పరగడుపున, సాయంత్రం ఒక్కో చెంచా చొప్పున తీసుకుంటే మంచి ఫలితం ఉంటుంది. లేదంటే ఇలా కూడా ప్రయత్నించచ్చు.. ఒక చెంచా పుచ్చకాయ గింజల్ని కొద్దిగా దంచి.. ఒక కప్పు బాగా మరిగించిన నీటిలో వేసి దాదాపు గంట పాటు పక్కన పెట్టాలి. ఆ తర్వాత ఈ మిశ్రమాన్ని వడకట్టి రోజూ నిర్ణీత వ్యవధుల్లో నాలుగు చెంచాల చొప్పున తీసుకుంటే కొన్ని రోజుల్లోనే సమస్య నుంచి బయటపడచ్చు.

నిమ్మరసం..
నిమ్మరసం వల్ల శరీరానికి ఎన్నో రకాల ప్రయోజనాలున్నాయి. ఇది అధిక రక్తపోటు సమస్య నుంచి కూడా విముక్తి కలిగిస్తుందని మీకు తెలుసా..? ఇందుకోసం ఒక గ్లాసు గోరువెచ్చటి నీళ్లలో అర నిమ్మచెక్క రసాన్ని పిండి రోజూ పరగడుపునే తాగాలి. దీనిలో ఉండే విటమిన్ సి యాంటీఆక్సిడెంట్గా పనిచేసి ఫ్రీరాడికల్స్ వల్ల శరీరానికి ఎలాంటి హాని కలగకుండా కాపాడుతుంది. అలాగే నిమ్మరసం చక్కటి రక్త ప్రసరణకు కూడా దోహదం చేస్తుంది. అయితే నిమ్మరసం మిశ్రమానికి ఉప్పు, చక్కెర.. వంటివి కలపకపోవడమే ఉత్తమం.

కొబ్బరి నీళ్లు..
కొబ్బరి నీళ్ల వల్ల శరీరానికి కావాల్సిన శక్తి అందడమే కాదు.. బీపీ కూడా అదుపులో ఉంటుంది. ఇందులో అధిక మొత్తంలో లభించే పొటాషియం, మెగ్నీషియం, విటమిన్ సి.. వంటివన్నీ సిస్టోలిక్ రక్తపోటును తగ్గించడంలో తోడ్పడతాయని ఓ అధ్యయనంలో వెల్లడైంది. కాబట్టి రోజూ కొబ్బరి నీళ్లు తాగుతూనే.. అప్పుడప్పుడూ కొబ్బరి నూనెను ఆహారంలో భాగం చేసుకుంటే సరిపోతుంది.

ఉల్లిపాయలు..
ఉల్లిపాయలంటే కొంతమంది మొహం చిట్లించుకుంటారు. కూరల్లో వేసినా తీసి పక్కన పెట్టేస్తుంటారు మరికొందరు. అయితే దీనివల్ల అధిక రక్తపోటు సమస్య నుంచి బయటపడచ్చట. ఇందుకోసం రోజూ చిన్న ఉల్లిపాయ ముక్కను తినడం లేదంటే ఒకటిన్నర చెంచా చొప్పున ఉల్లిపాయ రసం, తేనెల మిశ్రమాన్ని రోజుకు రెండుసార్లు కనీసం రెండు వారాల పాటు తీసుకోవడం వల్ల సమస్య నుంచి ఉపశమనం పొందచ్చు.
ఇవి కూడా...

* కొంచెం నీటిలో రెండు చెంచాల మెంతుల్ని వేసి మరిగించాలి. అవి చల్లారాక వడకట్టి తీసుకోవాలి. మెంతుల్లో అధికంగా ఉండే పొటాషియం, ఫైబర్.. వంటివి అధిక రక్తపోటు నుంచి త్వరిత ఉపశమనం కలిగించడంలో తోడ్పడతాయి. * తేనె కూడా అధిక రక్తపోటు నుంచి విముక్తి కలిగించడంలో దోహదం చేస్తుంది. ఇందుకోసం రోజూ పరగడుపున రెండు చెంచాల తేనె తీసుకోవడం మంచిది. అలాగే సమపాళ్లలో తులసి రసం, తేనె తీసుకొని ఈ మిశ్రమాన్ని కూడా ప్రయత్నించచ్చు. * అలాగే రోజుకు రెండు అరటిపండ్లు తినడం, అల్లాన్ని రోజువారీ ఆహారంలో భాగం చేసుకోవడం, కూరల్లో ఉప్పు తగ్గించడం, క్రమం తప్పకుండా వ్యాయామం చేయడం.. వంటివన్నీ అధిక రక్తపోటును తగ్గించుకోవడానికి సహజసిద్ధమైన మార్గాలే.. ఇలాంటి ఆహార నియమాలు పాటిస్తున్నప్పటికీ ఎప్పటికప్పుడు బీపీ చెక్ చేయించుకోవడం, డాక్టర్ చెప్పే సలహాలు, సూచనలు పాటించడం వల్ల అధిక రక్తపోటుకు ఆమడ దూరంలో ఉండచ్చు.. తద్వారా ఇతర అనారోగ్యాలూ దరిచేరకుండా జాగ్రత్తపడ్డ వాళ్లమవుతాం..
|