ప్రస్తుతం పండగలు, పెళ్లిళ్ల సీజన్ నడుస్తోంది. ఇలాంటి ప్రత్యేక సందర్భాలంటే నోరూరించే విభిన్న వంటకాలతో కూడిన విందులే గుర్తొస్తాయి. తలచుకుంటేనే నోరూరిపోతోంది కదూ! అయితే ఇలాంటి విందు భోజనం ఆరంగించేటప్పుడు బాగానే ఉంటుంది.. కానీ అమితంగా లాగిస్తే మాత్రం అజీర్తి, గ్యాస్ట్రిక్ సమస్యలు ఎదుర్కోక తప్పదు. ఏదేమైనా ఇలాంటి ప్రత్యేక వంటకాల ద్వారా ఎంతో కొంత మొత్తంలో కొవ్వులు, చక్కెరలు, శీతల పానీయాలు.. వంటివి మన శరీరంలోకి చేరిపోతాయి. నిజానికి ఇవి మన శరీరానికి మంచి కంటే చెడే ఎక్కువ చేస్తాయి. కాబట్టి మన శరీరంలో చేరిన ఇలాంటి విషతుల్యాలను తొలగించుకొని తిరిగి సాధారణ ఆహార నియమాలకు అలవాటు పడాలంటే కొన్ని చిట్కాలు పాటించాలంటోంది ‘భారత ఆహార భద్రత, నాణ్యతా ప్రమాణాల సంస్థ (FSSAI)’.
కరోనా వెలుగులోకి వచ్చిన దగ్గర్నుంచి ఆరోగ్యం విషయంలో అందరినీ అలర్ట్ చేస్తోందీ సంస్థ. ఈ క్రమంలో పోషకాహారం నిండిన ఆహార పదార్థాలు, ఇమ్యూనిటీని పెంచుకోవడం, శుచి-శుభ్రత, వంట నూనె వాడకం, ఉప్పు తగ్గించుకోవడం.. ఇలా పలు విషయాల్లో అవగాహన పెంచుతూ ట్విట్టర్లో పోస్టులు పెడుతోంది. ఈ నేపథ్యంలోనే పండగలు, ప్రత్యేక సందర్భాల్లో మన శరీరాన్ని డీటాక్స్ చేసుకోవడం గురించి పలు చిట్కాల్ని సూచిస్తూనే.. తద్వారా మన ఆరోగ్యాన్ని తిరిగి మెరుగుపరచుకోవచ్చని చెబుతోందీ సంస్థ.
మరుసటి రోజే మొదలుపెట్టండి!
*పండగలు, ప్రత్యేక సందర్భాల్లో స్వీట్స్ ఎక్కువగా లాగిస్తుంటాం. తద్వారా ఆ మరుసటి రోజు కూడా వాటిపైకే మనసు లాగుతుంది. అలాగని మళ్లీ అవే తింటే లేనిపోని అనారోగ్యాల బారిన పడే అవకాశం ఉంటుంది. కాబట్టి ఇలాంటి కోరికల్ని తగ్గించుకోవాలంటే సీజనల్ పండ్లు తీసుకోవాలి. ఇవీ నోటికి తియ్యదనాన్ని అందిస్తాయి. ఇక చక్కెర తినాలనిపిస్తే దానికి బదులుగా కొద్దిగా దాల్చిన చెక్క ముక్క లేదంటే జాజికాయ నోట్లో వేసుకుంటే మనసు సంతృప్తి పడుతుంది.. ఆరోగ్యమూ మన సొంతమవుతుంది.

*పెళ్లిళ్లు, ఇతర ఫంక్షన్లకు వెళ్లినప్పుడు లేదంటే ఏదైనా పార్టీకి బంధువులిళ్లకు వెళ్లినప్పుడు మొహమాటానికి పోయి టీ/కాఫీ తెగ తాగేస్తుంటాం. వాటి ద్వారా చేరిన కెఫీన్ని బయటికి పంపించేయాలంటే నిమ్మరసం కలిపిన నీళ్లు, కొబ్బరి నీళ్లు, సూప్స్, గంజి.. వంటివి చక్కటి ఎంపిక. మరీ అంతగా టీ/కాఫీ తాగాలనిపిస్తే మాత్రం రోజుకు ఒకటి లేదా రెండు కప్పులు చాలు!
*శరీరంలోని విషతుల్యాలను తొలగించడానికి వ్యాయామమూ సహకరిస్తుంది. కాబట్టి రోజూ కనీసం అరగంట పాటు వ్యాయామం చేయడం మంచిది. తద్వారా శరీరంలోని మలినాలు చెమట రూపంలో బయటికి వెళ్లిపోతాయి. అలాగే ఆరోగ్యమూ మన సొంతమవుతుంది.
*మనం ఉదయాన్నే తీసుకునే అల్పాహారం ఆ రోజుకంతటికీ కావాల్సిన శక్తిని మన శరీరానికి అందిస్తుంది.. మనల్ని మరింత ఉత్సాహంగా మారుస్తుంది. అలాగని పండగ లేదంటే పెళ్లిలో చేసిన స్వీట్స్, పిండి వంటలు తింటానంటే అస్సలు కుదరదు. వాటికి బదులుగా పోహా, ఉప్మా, ఇడ్లీ, దోసె.. వంటి ఆరోగ్యకరమైన ఆహార పదార్థాలే తీసుకోవాలి. అంతేకాదు.. అల్పాహారం మానేయడం కూడా అస్సలు మంచిది కాదు.. ఎందుకంటే అలా చేస్తే మరింత ఆకలేసి ఏది పడితే అది తినేస్తాం.. దీనివల్ల బరువు పెరిగే అవకాశం కూడా ఉంది.

*ప్రత్యేక సందర్భాల్లో లేట్ నైట్ డిన్నర్స్ మామూలే. అలాగని రోజూ ఆలస్యంగానే తింటామంటే ఆరోగ్యంపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి పడుకోవడానికి రెండు గంటల ముందే భోంచేసేయాలి. అది కూడా తేలిగ్గా జీర్ణమయ్యే పదార్థాలతోనే! ఇలా చేయడం వల్ల జీర్ణవ్యవస్థపై ప్రభావం పడకుండా ఉంటుంది.. అంతేకాదు.. రక్తంలో చక్కెర స్థాయులు కూడా అదుపులో ఉంటాయి.
*తినమన్నాం కదా అని గబగబా తినేయడం కాకుండా నెమ్మదిగా, ఆహారాన్ని బాగా నమిలి తినాలి. అప్పుడే వాటి రుచిని ఆస్వాదించడంతో పాటు ఎక్కువ సేపు ఆకలేయకుండా కూడా ఉంటుంది.

*మన శరీరాన్ని డీటాక్స్ చేయడంలో నీటిని మించింది లేదు. కాబట్టి రోజుకు కనీసం 8 గ్లాసుల నీళ్లు తాగడం తప్పనిసరి. తద్వారా శరీరంలోని విషతుల్యాలు సులభంగా బయటికి వెళ్లిపోతాయి.
*ప్రత్యేక సందర్భాల్లో మనకు నచ్చినవి అమితంగా లాగించడం వల్ల జీర్ణ వ్యవస్థపై ప్రతికూల ప్రభావం పడుతుంది. కాబట్టి జీర్ణ వ్యవస్థ పనితీరును తిరిగి గాడిలో పెట్టాలంటే ఫైబర్ ఎక్కువగా ఉండే సీజనల్ పండ్లు, కాయగూరలు, తృణధాన్యాలను ఆహారంలో భాగం చేసుకోవాలి. ఇవి సులభంగా జీర్ణమవుతాయి కాబట్టి జీర్ణక్రియ సాఫీగా సాగిపోతుంది.
పండగలు, పెళ్లిళ్లు.. వంటి ప్రత్యేక సందర్భాల వల్ల మన శరీరంలో చేరిన మలినాలను తొలగిస్తూనే ఆరోగ్యాన్ని పెంపొందించుకోవాలంటే పాటించాల్సిన చిట్కాలేంటో తెలుసుకున్నారుగా! అయితే ఇలాంటి ప్రత్యేక సందర్భాల్లో తీసుకున్న ఆహారం కారణంగా మీకేమైనా తీవ్ర అనారోగ్యాలు ఎదురైతే మాత్రం నిర్లక్ష్యం చేయకుండా వైద్యులను సంప్రదించడం మంచిదన్న విషయం గుర్తుంచుకోండి.