ఆవిరి కుడుములంటే గణనాథుడికి మహా ఇష్టం. అందుకే వినాయక చవితి రోజున అందరూ మోదకాలు చేసి ఆ పార్వతీ నందనుడికి నివేదిస్తారు. అయితే కేవలం పండగరోజునే కాదు.. నవరాత్రులూ భూమిపై పూజలందుకునే గణేషుడికి రోజుకో నైవేద్యం సమర్పించడం మనకు తెలిసిందే. ఈ క్రమంలో మళ్లీ మళ్లీ మోదకాలు తయారుచేసి గణపతికి నైవేద్యంగా సమర్పించే వారూ చాలామందే! అయితే ఎంతో అమోఘమైన రుచిని నింపుకొన్న ఈ ఆవిరి కుడుములు ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలను కూడా చేకూర్చుతాయంటున్నారు ప్రముఖ సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలు రుజుతా దివేకర్. ఈ క్రమంలోనే మోదకాలతో ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో వివరిస్తూ ఓ సుదీర్ఘమైన పోస్ట్ పెట్టారామె. మరి, మోదక ప్రియుడికి నివేదన చేసే ఈ ఆవిరి కుడుముల్లో దాగున్న ఆరోగ్య రహస్యాలేంటో మనమూ తెలుసుకుందాం రండి..
సెలబ్రిటీ పోషకాహార నిపుణురాలే అయినా తన సోషల్ మీడియా పోస్టులతో సామాన్యుల్లోనూ ఆరోగ్యం, ఫిట్నెస్ పట్ల అవగాహన పెంచుతున్నారు రుజుతా దివేకర్. ఆయా సీజన్ను బట్టి తీసుకోవాల్సిన ఆహార పదార్థాలు-వాటిలోని పోషక విలువలు, వివిధ అనారోగ్యాలు-వాటిని తగ్గించుకోవడానికి తీసుకోవాల్సిన పోషకాహారం, ఫిట్నెస్ను పెంచుకోవాలంటే చేయాల్సిన వ్యాయామాలు.. తదితర అంశాలపై నిరంతరం సోషల్ మీడియాలో పోస్టులు పెట్టే రుజుత.. తాజాగా వినాయక చవితి సందర్భంగా మరో పోస్ట్ పెట్టారు. గణపతికి ప్రీతిపాత్రమైన మోదకాల వల్ల ఆరోగ్యానికి ఎలాంటి ప్రయోజనాలు చేకూరతాయో ఆ పోస్ట్ ద్వారా వివరించారామె.
కుడుములు.. ఎవరికి, ఎంత మంచివి?
సాధారణంగా ఆవిరి కుడుములంటే బియ్యప్పిండితో తయారుచేస్తాం. అందులో స్టఫింగ్ కోసం కొబ్బరి తురుము, బెల్లం, నెయ్యి.. వంటివి వాడతాం. ఈ క్రమంలోనే అరటి ఆకుల్లో అందంగా పేర్చి, కుంకుమ పువ్వుతో గార్నిష్ చేసిన కుడుముల ఫొటోను ఇన్స్టాలో పంచుకున్న రుజుత.. వాటిలో దాగున్న ఆరోగ్య రహస్యాల గురించి ఇలా వివరించారు.
గణపతికి ఎంతో ప్రీతిపాత్రమైన మోదకాలను తప్పకుండా తినాల్సిందే.. ఎందుకంటే..!
* మోదకాల తయారీలో వాడే నెయ్యి పేగు శ్లేష్మ పొరను పునర్నిర్మిస్తుంది. తద్వారా పొట్టలోని విషపదార్థాలు సులభంగా బయటికి వెళ్లిపోయి మలబద్ధకం సమస్య నుంచి విముక్తి పొందచ్చు.
* కొబ్బరిలోని మీడియం చెయిన్ ట్రై-గ్లిజరైడ్స్ రక్తప్రసరణను అదుపులో ఉంచడంలో సహకరిస్తాయి. తద్వారా గుండె పదిలంగా ఉంటుంది.
* కొబ్బరిలోని ప్లాంట్ స్టెరాల్స్, స్టఫింగ్ కోసం ఉపయోగించే డ్రైఫ్రూట్స్.. వంటివి శరీరంలోని చెడు కొవ్వును తగ్గించి.. మంచి కొవ్వును పెంచుతాయి. ఫలితంగా బరువు అదుపులో ఉంటుంది.
* బియ్యప్పిండి, కొబ్బరి, బెల్లంతో తయారుచేసిన కుడుముల్ని ఆవిరిపై ఉడికించి, నెయ్యిలో నంజుకొని తింటే ఆ రుచి అమోఘం. అయితే ఈ పదార్థాలన్నీ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటాయి.. కాబట్టి పూర్తి సురక్షితం. మధుమేహంతో బాధపడే వారికైతే ఇవి మరీ మంచివి. ఎందుకంటే ఇవి రక్తంలో చక్కెర స్థాయుల్ని స్థిరంగా ఉంచడంలో తోడ్పడతాయి.
* నెయ్యిలోని బ్యుటిరికామ్లం శరీర కణజాలాల్లోని వాపును తగ్గించడంలో ప్రభావవంతంగా పనిచేస్తుంది. ముఖ్యంగా కీళ్ల వాపును తగ్గించి ఆర్థ్రైటిస్ సమస్యను దూరం చేస్తుంది.
* నెలసరికి ముందు మహిళల్లో ఆహారపు కోరికలు (పీఎంఎస్) ఎక్కువగా ఉంటాయి. అలాగే ఈ సమయంలో హార్మోన్లలో మార్పుల వల్ల రక్తంలో చక్కెర స్థాయులు పడిపోతాయి. తద్వారా తీపి తినాలన్న కోరిక పెరుగుతుంది. ఈ కోరికల్ని తగ్గించడంలో బియ్యంలోని విటమిన్ ‘బి1’ సహకరిస్తుంది. అలాగే బియ్యప్పిండి రక్తంలోని చక్కెరను స్థిరంగా ఉంచడంలో తోడ్పడుతుంది.
* వయసు పైబడిన ఛాయల్ని రూపుమాపి.. నవయవ్వనంగా కనిపించేందుకు, థైరాయిడ్ గ్రంథి పనితీరును మెరుగుపరిచేందుకు ఈ రుచికరమైన కుడుములకు సాటి మరొకటి లేదు.
* బరువు తగ్గే ప్రయత్నాల్లో ఉన్నారా? అయితే కుడుములు అందుకు సహకరిస్తాయి. వీటి తయారీకి వాడిన పదార్థాలన్నీ తక్కువ గ్లైసిమిక్ ఇండెక్స్ని కలిగి ఉంటాయి. మంచి కొవ్వులు, పోషక విలువల్ని నింపుకొన్న ఈ మోదకాలను వద్దనడానికి కారణమే లేదు. అలాగే శారీరక, మానసిక ఆరోగ్యానికి.. దృఢత్వానికీ ఈ వంటకం చక్కగా ఉపయోగపడుతుంది..’ అంటూ మోదకాల వల్ల చేకూరే ప్రయోజనాల గురించి చెప్పుకొచ్చారు రుజుత.