గృహిణి.. ఇంటిల్లిపాదికీ సమయానికి అన్నీ అందిస్తూ తలలో నాలుకలా వ్యవహరించాలి.
ఉద్యోగిని.. ఇంట్లో, ఆఫీసులో ఎక్కడా ఎలాంటి లోటూ కనిపించకుండా సమర్థంగా పనిచేయగలగాలి.
విద్యార్థిని.. బాగా చదువుకోవాలి.. మంచి మార్కులు తెచ్చుకోవాలి.
ఇలా మహిళలు ఏ వయసు వారైనా జీవితంలో తమ బాధ్యతల్ని చక్కగా నెరవేర్చే క్రమంలో ఎంతో ఒత్తిడికి గురవుతున్నారు. దీనివల్ల కలిగే చిరాకు, కోపం లాంటి వాటిని వారు ఇతరులపై చూపించలేరు. వాటిని తమలోనే అణచి ఉంచుతారు. దీనివల్ల మరింతగా ఒత్తిడికి లోనవుతున్నారు. ఇది హార్మోన్ల అసమతుల్యతకు దారి తీస్తుంది. ఫలితంగా వూబకాయం, డయాబెటిస్, థైరాయిడ్ లాంటి సమస్యలకు గురవుతున్నారు. మనలో ఉన్న ఒత్తిడిని బయటకు పంపిస్తే ఇలాంటి సమస్యలేమీ మన దరిచేరవు. అందుకు యోగానే చక్కటిమార్గం. అంతేకాదు మహిళలు ఎదుర్కొనే ప్రతి సమస్యకు ప్రత్యేకమైన యోగాసనాలు వేయడం ద్వారా దాని నుంచి బయట పడచ్చు.

గ్రంథుల పనితీరుకు..
థైరాయిడ్ గ్రంథి మన శరీరంలోని అన్ని గ్రంథులకు మధ్య సంధానకర్తగా పనిచేస్తుంది. ఇటీవలి కాలంలో థైరాయిడ్ సమస్యతో బాధపడేవారి సంఖ్య చాలా వేగంగా పెరుగుతోంది. దీనికి ముఖ్య కారణం ఒత్తిడి. చాలామంది మహిళలు తమ సమస్యను బయటకు చెప్పుకోలేరు. తాము ఎదుర్కొంటున్న ఇబ్బందులను ఎవరితోనూ పంచుకోలేక లోలోపలే కుమిలిపోతుంటారు. ఇలా చేయడం వల్ల ఒత్తిడి పెరిగిపోయి థైరాయిడ్ గ్రంథి పనితీరు దెబ్బతింటుంది. ఫలితంగా వూబకాయం, ఆకలి లేకపోవడం, జుట్టు రాలిపోవడం లాంటి సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుంది.

విశుద్ధచక్రాసనం వేయడం ద్వారా ఒత్తిడిని అధిగమించి థైరాయిడ్ పనితీరుని మెరుగుపరచుకోవచ్చు. అలాగే పిట్యూటరీ గ్రంథి ఇతర గ్రంథుల పనితీరును సమన్వయ పరుస్తుంది. కానీ ఒత్తిడి పెరగడం వల్ల గ్రంథుల మధ్య సమాచార వ్యవస్థ దెబ్బతిని శ్వాసవేగం పెరిగిపోతుంది. దీనివల్ల శరీరంలో ఆక్సిజన్ శాతం తగ్గిపోతుంది. ఫలితంగా అవయవాలకు సరిపడినంత ఆక్సిజన్ లభించదు. దాంతో హార్మోన్ల మధ్య సమతౌల్యం లోపించి రుతుచక్రం దెబ్బతింటుంది. అంతేకాదు డయాబెటిస్, ఎసిడిటీ, అల్సర్ లాంటి సమస్యలు కూడా వస్తాయి. ఒత్తిడి వల్ల కలిగే ఈ సమస్యలను యోగా ద్వారా తగ్గించుకోవచ్చు. దీనికోసం సూర్యనమస్కారాలు, విపరీతకర్ణి, నౌకాసనం, మత్య్సాసనం, భ్రమరీప్రాణాయామం, అంతర్ముఖ ముద్ర చేయాలి.

వూబకాయం..
ఈ సమస్య నుంచి బయటపడటానికి సూర్యనమస్కారాలు బాగా పనిచేస్తాయి. అలా అని రోజుకి వంద నుంచి రెండు వందల సూర్యనమస్కారాలు చేయాల్సిన అవసరం లేదు. ఈ మధ్యకాలంలో యోగాని ఎక్సర్సైజ్లా చేస్తూ దాన్ని పవర్యోగా అంటున్నారు. అలా చేస్తున్నప్పుడు మొదట బాగానే ఉంటుంది. కానీ రెండు మూడు నెలల వ్యవధిలోనే నడుము నొప్పి వచ్చే అవకాశం ఉంటుంది. అలా కాకుండా రోజుకి ఇరవై వరకు సూర్య నమస్కారాలు చేయచ్చు. సూర్య నమస్కారాల వల్ల శరీరంలోని ప్రతి భాగం కదులుతుంది. ఫలితంగా కొవ్వు కరిగిపోవడం ప్రారంభిస్తుంది. అలాగే నౌకాసనం, పాదహస్తాసనం, ఉత్థానుపాదాసనం, శ్రీలింగముద్ర, కపాలభాతి లాంటి ఆసనాలు వేసుకోవచ్చు. అలాగే భస్త్రికా ప్రాణాయామం కూడా చేస్తూ ఉండాలి.

గైనిక్ సమస్యలు
పీసీఓడీ, సిస్టులు, నీటిబుడగలు లాంటి సమస్యల బారిన పడుతున్న మహిళల సంఖ్య కూడా రోజురోజుకీ పెరుగుతోంది. సమస్య వచ్చిన తర్వాత తీసుకొనే చర్యల కన్నా సమస్య రాకుండా చూసుకోవడం మంచిది. గైనిక్ సమస్యలు రాకుండా ఉష్ట్రాసనం, భుజంగాసనం, ధనురాసనం, శుప్తగోరక్షాసనం, పక్షిక్రియ, పశ్చిమోత్తాసనం, హలాసనం, చక్రాసనం, సర్వాంగాసనం, మాతంగి ముద్ర, నాడీశోధన ప్రాణాయామం, భ్రమరీ ప్రాణాయామం చేయాలి.

వెన్ను సంబంధ సమస్యలు..
ఇంట్లో ఉన్నా.. ఆఫీసుకు వెళ్లినా మహిళలు ఎక్కువ సమయం కూర్చునే ఉంటారు. దీనివల్ల వెన్నుపాముపై తీవ్ర ఒత్తిడి పడుతుంది. ఫలితంగా చాలామంది చిన్న వయసులోనే నడుము నొప్పి, మెడనొప్పితో బాధపడుతున్నారు. ఈ సమస్యకు మేరుదండాసనాలు పరిష్కారం చూపిస్తాయి. అలాగే మార్జాలాసనం, వ్యాఘ్రాసనం, భుజంగాసనం వేస్తూ ఉండాలి. పృష్ణ ముద్ర, మేరుదండ ముద్రలు కూడా వేయడం వల్ల ఈ సమస్య నుంచి బయటపడచ్చు.