శరీరంలో పేరుకున్న మలినాలను తొలగించుకుంటే ఎన్నో ప్రయోజనాలుంటాయి. బరువు అదుపులో ఉంటుంది.. రోగనిరోధక శక్తి పెరుగుతుంది. ముఖం కొత్త నిగారింపుని సంతరించుకుంటుంది. ఈ పానీయాలు అదనపు పోషకాలనీ అందిస్తాయి...

బత్తాయి+ అల్లం+ దాల్చిన చెక్క
బత్తాయిని సన్నటి చక్రాల్లా తరిగి చల్లటి నీళ్లల్లో వేయాలి. దానిలో అల్లం ముక్క, అయిదారు పుదీనాకులు, దాల్చిన చెక్క వేసి నాననివ్వాలి. బత్తాయి నుంచి విటమిన్- సి తగినంతగా లభిస్తుంది. ఇది జీర్ణశక్తిని మెరుగుపరుస్తుంది. జింక్, క్యాల్షియం.. ఖనిజాలు అల్లంలో తగినంతగా లభిస్తాయి. దాల్చినచెక్కలోని పోషకాలు రక్త సరఫరాని మెరుగుపరుస్తాయి. ఈ పానీయం తాగితే ఆరోగ్యంతోపాటు చర్మం మెరుస్తుంది.

కీరదోస+ పుదీనా+ నిమ్మ
గాజు సీసాలో చల్లటి నీళ్లు పోసి... కీరదోసని పలుచటి చక్రాల్లా తరిగి వేయాలి. పుదీనా ఆకులు, సన్నగా తరిగిన రెండు నిమ్మకాయ స్లైసులు వేసి నాలుగైదు గంటలు నాననివ్వాలి. ఈ పానీయం శరీరాన్ని చల్లబరిచి సాంత్వననిస్తుంది.

పుచ్చకాయ+ కొబ్బరి నీళ్లు+ తులసి
కప్పు పుచ్చకాయ ముక్కల్లో కొన్ని కొబ్బరినీళ్లు పోసి గ్రైండ్ చేసుకోవాలి. దీంట్లో కాసిన్ని తులసి ఆకులు వేసుకుని తాగితే చాలు. పుచ్చకాయలోని లైకోపిన్ శరీరంలోని వ్యర్థాలను బయటకు నెట్టేస్తుంది. కొబ్బరి నీళ్ల నుంచి పొటాషియం, మెగ్నీషియం, క్యాల్షియం తగినంతగా లభిస్తాయి. దీన్ని తీసుకోవడం వల్ల తక్షణ శక్తి అందుతుంది. తులసి యాంటీబ్యాక్టీరియల్గా పనిచేస్తుంది.