కరోనా కాలం మొదలైనప్పటి నుంచి ఎవరికి ఫోన్ చేసినా.. ప్రత్యేకమైన కాలర్ట్యూన్ వినిపిస్తోంది. తల్లిలా జాగ్రత్తలు చెబుతోందా గొంతు. అక్కలా హెచ్చరిస్తోంది. ఇంతకీ ఎవరిదా గొంతు? తెలుగులో తేటగా, స్పష్టంగా సూచనలు చేసిన విశాఖపట్నానికి చెందిన దుగ్గిరాల పద్మావతి గళమది...
కరోనాపై అవగాహన కల్పించడానికి టెలీకమ్యూనికేషన్స్ విభాగం, కేంద్ర ఆరోగ్యశాఖ సహకారంతో కాలర్ట్యూన్ రూపొందించింది. కొవిడ్పై ప్రజల్లో చైతన్యం తీసుకువచ్చేలా వివిధ భాషల్లో కాలర్ట్యూన్ అందుబాటులోకి తెచ్చారు. ఈ క్రమంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల పరిధిలోని చరవాణీల్లో తెలుగు కాలర్ట్యూన్ మార్మోగుతోంది. సమాజ హితాన్ని కోరుతూ తయారు చేసిన ఈ కాలర్ట్యూన్కు తన గొంతును అరువిచ్చారు విశాఖపట్నానికి చెందిన పద్మావతి. మార్చి మొదటివారం నుంచి మనం వింటున్న గొంతు ఆమెదే!
‘ఈ కాలర్ట్యూన్ను హిందీలో ఇచ్చారు. దానిని నేనే తెలుగులోకి అనువదించుకున్నాను. ఉన్నది ఉన్నట్టుగా చెబితే.. ఎక్కువ సమయం పడుతుందనిపించింది. అందుకే, భావం చెడకుండా మార్పులు చేసి 30 సెకన్ల నిడివి ఉండేలా వాయిస్ఓవర్ ఇచ్చాను’ అంటున్నారు పద్మావతి. కరోనా సోకకుండా రక్షణ చర్యలు తీసుకోవడంపై రెండు కాలర్ట్యూన్లకు వాయిస్ ఇచ్చారు. తాజాగా వైద్యులు, పోలీసులు, పారిశుద్ధ్య కార్మికులను గౌరవించాలంటూ మరో కాలర్ట్యూన్కు గాత్రదానం చేశారు. వైజాగ్లో డిగ్రీ చేసిన పద్మావతి దిల్లీలో ఉంటున్నారు. ఈమె భర్త డీవీ ప్రభాకర్ కేంద్రప్రభుత్వోద్యోగి. ఎంఏ సోషియాలజీ చదివిన పద్మావతి ఓ ప్రైవేట్ సంస్థలో కన్సల్టెంటుగా పని చేస్తున్నారు. ఆసక్తి కొద్దీ డబ్బింగ్ చెప్పడం మొదలు పెట్టారు. పదేళ్లుగా పలు కార్యక్రమాలకు వాయిస్ ఓవర్ ఇస్తున్నారు. కేంద్రప్రభుత్వ పథకాలపై అవగాహన కల్పించే రేడియో కార్యక్రమాలకు వాయిస్ఓవర్ ఇచ్చారు. దాదాపు 500 ఎపిసోడ్స్కు తన గాత్రం అందించారు.